జమిల్కు సన్నని జరీ (బంగారం) దారాన్ని ఉపయోగించి చేసే ఎంబ్రాయిడరీలో నైపుణ్యం ఉంది. హౌరా జిల్లాకు చెందిన ఈ 27 ఏళ్ళ కార్మికుడు ఖరీదైన వస్త్రాలకు మెరుగులు, మెరుపులూ అద్దుతూ గంటల తరబడి నేలపై కాళ్ళు ముడుచుకుని కూర్చునేవాడు. కానీ, అతను తన ఇరవైల వయసులోనే ఎముకల క్షయవ్యాధి బారిన పడడంతో, ఈ సూదీదారాలను దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ వ్యాధి అతని ఎముకలను బలహీనం చేసినందువల్ల అతను ఎక్కువ సేపు కాళ్ళను మడత పెట్టుకుని కూర్చోలేడు.
“ఇది నేను పని చేయాల్సిన వయస్సు, [నా] తల్లిదండ్రులు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. నా వైద్యం కోసం వాళ్ళు పనిచేయాల్సివస్తోంది,” అని హౌరా జిల్లాలోని చెంగైల్ ప్రాంతంలో నివసిస్తూ, చికిత్స కోసం తరచూ కొల్కతాకు వెళ్ళే ఈ యువకుడు వాపోయాడు.
ఇదే జిల్లాలో అవిక్, తన కుటుంబంతో కలిసి హౌరాలోని పిల్ఖానా మురికివాడలో నివసిస్తున్నాడు. ఈ టీనేజ్ బాలునికి కూడా ఎముకల క్షయవ్యాధి ఉంది. దీనివలన అతను 2022 మధ్య నుంచి పాఠశాలకు వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది. అతనిప్పుడు కోలుకుంటున్నా, ఇప్పటికీ పాఠశాలకు వెళ్ళలేకపోతున్నాడు.
నేను 2022లో ఈ కథనాన్ని చేయడం ప్రారంభించినప్పుడు జమిల్, అవిక్, ఇంకా కొంతమందిని మొదటిసారి కలిశాను. వారి రోజువారీ జీవితం గురించి ఫొటోలు తీస్తున్న క్రమంలో వారి గురించి తెలుసుకోవడం కోసం పిల్ఖానా మురికివాడల్లోని వాళ్ళ ఇళ్ళకు తరచూ వెళ్ళేవాడ్ని.
ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్ళే స్తోమత లేని జమిల్, అవిక్లు మొదట దక్షిణ 24 పరగణాలు, హౌరా జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక ప్రభుత్వేతర సంస్థ రోగుల కోసం నిర్వహించే సంచార క్షయవ్యాధి వైద్యశాలకు పరీక్షల కోసం వచ్చారు. వాళ్ళలాగా చాలామంది ఇలా పరీక్షల కోసం వస్తుంటారు.


ఎడమ: జమిల్కు ఎముకల క్షయవ్యాధి వచ్చినప్పుడు, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం వల్ల అతను తన జరీ ఎంబ్రాయిడరీ పనిని వదులుకోవాల్సి వచ్చింది. కుడి: ఎముకల క్షయవ్యాధి సోకిన అవిక్ నడిచే సామర్థ్యాన్ని కోల్పోయాడు, కానీ ఇప్పుడు చికిత్సతో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఫొటోలో వాకింగ్ బ్రేస్ ధరించడంలో అతనికి సహాయం చేస్తోన్న అతని తండ్రి


ఊపిరితిత్తుల క్షయవ్యాధిని గుర్తించడానికి ఎక్స్-రే (ఎడమ) ప్రధాన రోగనిర్ధారణ సాధనం. ఎక్స్- రేను చూసిన తర్వాత వైద్యుడు కఫ పరీక్షను సిఫార్సు చేయవచ్చు. 24 ఏళ్ళ రోగి ఎంఆర్ఐ స్కాన్లో (కుడి) కనిపిస్తోన్న వెన్నెముక క్షయవ్యాధి (పాట్స్ వ్యాధి) కారణంగా ఏర్పడిన కంప్రెషన్ ఫ్రాక్చర్లు
"క్షయవ్యాధి ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మళ్ళీ ఉద్భవించింది" అని ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ( NFHS-5 ) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం క్షయవ్యాధి కేసులలో 27 శాతం భారతదేశంలోనే ఉన్నాయి (నవంబర్ 2023లో ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ టిబి నివేదిక )
కొల్కతా లేదా హౌరాకు రాలేనివారికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం కోసం ఇద్దరు వైద్యులు, 15 మంది నర్సులతో కూడిన సంచార బృందం ఒక రోజులో దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించి, నాలుగైదు ప్రదేశాలను సందర్శిస్తుంది. సంచార వైద్యశాలలకు వచ్చే రోగులలో దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రాళ్ళను పగలగొట్టే పని చేసేవాళ్ళు, బీడీలు చుట్టేవాళ్ళు, బస్సుల, ట్రక్కుల డ్రైవర్లు ఉన్నారు.
సంచార వైద్యశాలలలో నేను ఫొటో తీసి, మాట్లాడిన రోగులలో చాలామంది గ్రామీణ ప్రాంతాలనుంచీ, పట్టణ మురికివాడల నుంచీ వచ్చినవాళ్ళు.
ఈ సంచార వైద్యశాలలను కోవిడ్ కాలంలో ప్రత్యేకంగా ప్రారంభించారు, ఆ తర్వాత అవి ఆగిపోయాయి. అవిక్ లాంటి క్షయవ్యాధి రోగులు ఇప్పుడు తర్వాతి చికిత్సల కోసం హౌరాలోని బ్యాఁ ట్రా సెయింట్ థామస్ హోమ్ వెల్ఫేర్ సొసైటీకి వెళుతున్నారు. ఈ పిల్లవాడిలాగే, ఈ సొసైటీకి వచ్చే ఇతరులు కూడా అట్టడుగు వర్గాలకు చెందినవారు, రద్దీగా ఉండే ప్రభుత్వాసుపత్రులకు వెళితే, వీరికి ఆ రోజు సంపాదన పోతుంది.
క్షయవ్యాధి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స, సంరక్షణల సంగతి అటుంచి, చాలా కొద్దిమందికే అసలు ఆ వ్యాధి గురించి తెలుసని రోగులతో మాట్లాడుతున్నప్పుడు నాకర్థమైంది. చాలామంది క్షయ రోగులు వేరే ప్రత్యామ్నాయం లేనందువల్ల తమ కుటుంబాలతో కలిసి ఒకే గదిలో నివసిస్తున్నారు. కలిసి పనిచేసేవాళ్ళు కూడా ఒకే గదిలో ఉంటున్నారు. “నేను నా సహోద్యోగులతో కలిసి ఉంటున్నాను. వాళ్ళలో ఒకరికి క్షయ ఉంది, కానీ ఉండడానికి ప్రత్యేకంగా గదిని తీసుకునే స్తోమత నాకు లేదు కాబట్టి అతనితో కలిసి ఒకే గదిలో ఉంటున్నా,” అని 13 సంవత్సరాల క్రితం దక్షిణ 24 పరగణాల జిల్లా నుంచి హౌరాలోని జనపనార ఫ్యాక్టరీలో పనిచేయడానికి వలస వచ్చిన రోషన్ కుమార్ చెప్పారు.
*****


'క్షయవ్యాధి ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మళ్ళీ ఉద్భవించింది" అని ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 (NFHS-5) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం క్షయవ్యాధి కేసులలో 27 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. ట్యూబెర్క్యులస్ మెనింజైటిస్ ఉన్న ఈ రోగికి (ఎడమ) మొదట ఎలాంటి చికిత్స అందలేదు. కానీ చికిత్స తర్వాత వ్యాధి తగ్గుముఖం పడుతోంది. వాకర్ సహాయంతో నడుస్తున్న ఒక ఊపిరితిత్తుల క్షయరోగి (కుడి). దీనిని పట్టుకుని నడవడానికి ఈమెకు నాలుగు నెలల పాటు క్రమం తప్పని చికిత్స అవసరమైంది


మూడుసార్లు క్షయవ్యాధితో పోరాడిన
రాఖీ శర్మ (ఎడమ), తన చదువును పూర్తిచేయాలనే దృఢ నిశ్చయంతో ఉంది. ఎముకల టిబి కారణంగా
కాలిపై పుండు ఏర్పడిన తన కుమారునికి (కుడి) లెగ్ గార్డ్ను అమరుస్తున్న తల్లి
మొత్తం ప్రపంచంలో క్షయవ్యాధితో బాధపడుతున్న పిల్లలలో మన దేశంలోనే 28 శాతం మంది ఉన్నారని, కౌమారదశలోని పిల్లలు, క్షయవ్యాధిపై ఏర్పాటు చేసిన 2021 జాతీయ ఆరోగ్య మిషన్ నివేదిక పేర్కొంది.
అవిక్కు టిబి ఉందని నిర్ధారణ అయినప్పుడు, అతను తమ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న పాఠశాలకు నడవలేకపోవటంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. "నేను బడినీ, నా స్నేహితులనూ మిస్సవుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి, నాకంటే ఒక తరగతి పైన ఉన్నారు. ఆటలు ఆడలేకపోతున్నందుకు కూడా బాధగా ఉంది,” అని 16 ఏళ్ళ అవిక్ అన్నాడు.
భారతదేశంలో, ప్రతి సంవత్సరం 0-14 సంవత్సరాల మధ్య వయసున్న 3.33 లక్షలమంది పిల్లలు క్షయతో బాధపడుతున్నారని అంచనా; ఇది అబ్బాయిలకు సోకే అవకాశమే ఎక్కువ. "పిల్లలలో టిబిని నిర్ధారించడం చాలా కష్టం... అవి పిల్లలలో కనిపించే ఇతర చిన్ననాటి అనారోగ్య లక్షణాల మాదిరిగానే ఉంటాయి..." అని ఎన్ఎచ్ఎమ్ నివేదిక చెబుతోంది. చిన్నవయసు క్షయ రోగులకు ఎక్కువ మోతాదులో మందులు అవసరమని ఈ నివేదిక పేర్కొంది.
పదిహేడేళ్ళ రాఖీ శర్మ క్షయవ్యాధితో సుదీర్ఘ యుద్ధం చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె ఇప్పటికీ ఎవరో ఒకరి సహాయం లేకుండా నడవలేదు, ఎక్కువ గంటలు కూర్చోలేదు. ఆమె కుటుంబం మొదటి నుంచీ పిల్ఖానా మురికివాడలోనే నివసిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయింది. హౌరాలోని ఒక దుస్తుల తయారీ కర్మాగారంలో పనిచేస్తోన్న ఆమె తండ్రి రాకేశ్ శర్మ, “మేం తన కోసం ఇంట్లోనే ఒక ప్రైవేట్ ట్యూటర్ని పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. వీలైనంత వరకు ఆమెకు సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నా, మాకు ఆర్థిక పరిమితులున్నాయి," అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో టిబి కేసులు ఎక్కువగా ఉన్నాయి; వంట చెరకుగా గడ్డిని లేదా ఎండుగడ్డిని ఉపయోగించే ఇళ్ళల్లో నివసించేవారు, ప్రత్యేకమైన వంటగది లేనివారు, వాటికి దగ్గరగా నివసించేవారికి టిబి వచ్చే అవకాశం ఉందని ఇటీవలి ఎన్ఎఫ్ఎచ్ఎస్ 5 నివేదిక చెబుతోంది.
పేదరికం వలన కలిగే ఆహార, ఆదాయ లేమి వల్ల క్షయవ్యాధి రావటంతో పాటు ఈ వ్యాధి రావటంవలన బాధితుల పేదరికం మరింత పెరుగుతుందనేది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల సాధారణ అభిప్రాయం.


ఇరుకుగా ఉండే జీవన పరిస్థితులు ఇతర కుటుంబ సభ్యులకు కూడా టిబి వ్యాధి సోకే అవకాశాన్ని పెంచుతాయి. మహిళా రోగులను ఒంటరిగా ఉంచటం చాలా కష్టం. కోలుకోవడం కోసం వారిని ఒంటరిగా (కుడి) ఉంచితే, తమను వదిలేశారని వాళ్ళు భావిస్తారు


ఎడమ: బ్యాఁట్రా సెయింట్ థామస్ హోమ్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి మోనికా నాయక్ క్షయతో బాధపడుతున్న రోగులకు నిరంతరం సహాయపడుతుంటారు. కుడి: కొల్కతా సమీపంలోని హౌరాలో ఉన్న బ్యాఁట్రా సొసైటీ ఛారిటబుల్ క్షయవ్యాధి ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులు
క్షయ రోగి కుటుంబాలు, తమని వెలిగా చూస్తారనే భయంతో దాని గురించి బైటికి చెప్పుకోరని ఎన్ఎఫ్ఎచ్ఎస్-5 పేర్కొంది: "... ప్రతి ఐదుగురిలో ఒక కుటుంబ సభ్యుడు తమ కుటుంబ సభ్యుల క్షయవ్యాధి స్థితిని గురించి బైటకు చెప్పకూడదని అనుకుంటాడు." టిబి ఆసుపత్రిలో పనిచేయడానికి ఆరోగ్య కార్యకర్తలు కూడా ముందుకు రారు.
భారతదేశంలోని క్షయ రోగులలో నాలుగవ వంతు మంది పునరుత్పత్తి వయస్సులో (15 నుండి 49 సంవత్సరాలు) ఉండే మహిళలే అని జాతీయ ఆరోగ్య మిషన్ నివేదిక (2019) తెలిపింది. పురుషుల కంటే స్త్రీలకు తక్కువగా క్షయవ్యాధి సోకుతున్నా, అది సంక్రమించినవాళ్ళు తమ ఆరోగ్యంకంటే కుటుంబ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు.
"నేను వీలైనంత త్వరగా [ఇంటికి] తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నా భర్త వేరొకరిని పెళ్ళిచేసుకుంటాడేమోనని భయంగా ఉంది," అని బిహార్కి చెందిన క్షయ రోగి హనీఫా అలీ తన వివాహ బంధం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మందులు తీసుకోవడం మానేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హౌరాలోని బ్యాఁట్రా సెయింట్ థామస్ హోమ్ వెల్ఫేర్ సొసైటీ వైద్యులు అన్నారు.
“మహిళలు తమ బాధలను ఎక్కువగా బైటికి చెప్పుకోరు. వారు రోగ లక్షణాలను దాచిపెట్టి పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది,” అని సొసైటీ కార్యదర్శి మోనికా నాయక్ చెప్పారు. ఆమె క్షయవ్యాధి రంగంలో 20 సంవత్సరాలకు పైగా పని చేస్తున్నారు. క్షయ నుంచి కోలుకోవడం సుదీర్ఘ ప్రక్రియ అనీ, మొత్తం కుటుంబంపై దాని ప్రభావం పడుతుందనీ ఆమె వివరించారు.
“రోగి కోలుకున్నప్పటికీ, వారి కుటుంబం వారిని తిరిగి అక్కున చేర్చుకోకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేం కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా కష్టపడాలి,” అని మోనికా చెప్పారు. క్షయవ్యాధి నివారణ రంగంలో చేసిన అవిశ్రాంత కృషికి గాను ఆమె ప్రతిష్ఠాత్మకమైన జర్మన్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ను అందుకున్నారు.
సుమారు 40 ఏళ్ళ వయసున్న ఆలాపి మండల్ క్షయ నుంచి కోలుకున్నారు. “నేను నా కుటుంబాన్ని తిరిగి చేరడానికి రోజులు లెక్కపెట్టుకుంటున్నాను. ఈ సుదీర్ఘ పోరాటంలో వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలిపోయారు…” అని ఆమె వాపోయారు.
*****


ఎడమ: టిబి మందులను ఎక్కువకాలం ఉపయోగించడంవల్ల క్రానిక్ డిప్రెషన్లాంటి అనేక దుష్ప్రభావాలున్నాయి. కుడి: రోగిని తనిఖీ చేస్తున్న డాక్టర్ టోబాయాస్ వోట్


ఎడమ: రిఫామ్పిన్ అత్యంత ప్రభావవంతమైన ఫస్ట్-లైన్ ఔషధం. సూక్ష్మజీవులు రిఫామ్పిన్కు లొంగకుంటే, అది చికిత్సను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కుడి: ఇక్కడ పని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల టిబి ఆసుపత్రులకు సిబ్బందిని సమకూర్చుకోవడం తరచుగా కష్టంగా మారుతోంది
ఆరోగ్య కార్యకర్తలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాస్క్ ధరించటం తప్పనిసరి. సొసైటీ నిర్వహిస్తోన్న వైద్యశాలలో క్షయవ్యాధి ముదిరిన రోగులను ప్రత్యేక వార్డులో ఉంచుతారు. ఔట్ పేషెంట్ విభాగం రోజుకు 100-200 మంది రోగుల చొప్పున వారానికి రెండుసార్లు సేవలందిస్తుంది. వీరిలో 60 శాతం మంది మహిళా రోగులు.
క్షయవ్యాధికి సంబంధించిన మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల చాలామంది రోగులలో క్లినికల్ డిప్రెషన్ లాంటి దుష్ప్రభావాలు ఉంటాయని ఈ రంగంలో పనిచేస్తున్న వైద్యులు అంటున్నారు. సరైన చికిత్స అనేది సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. డిశ్చార్జ్ అయిన తర్వాత, రోగులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి, వాళ్ళకు ఆరోగ్యకరమైన ఆహారం అవసరం.
చాలామంది రోగులు తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవాళ్ళు కాబట్టి, తరచుగా మందులను మధ్యలోనే ఆపేస్తుంటారు. దీని వలన వారికి ఎండిఆర్ టిబి (మల్టీ-డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్యులోసిస్) వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ టోబాయాస్ వోట్ అన్నారు. జర్మనీకి చెందిన ఈ వైద్యుడు, గత రెండు దశాబ్దాలుగా హౌరాలో క్షయవ్యాధికి చికిత్స చేస్తున్నారు.
మల్టీడ్రగ్ రెసిస్టెంట్ టిబి (MDR-TB) ప్రజారోగ్య సంక్షోభంగానూ, ఆరోగ్య భద్రతకు ముప్పుగానూ మారింది. 2022లో డ్రగ్ రెసిస్టెంట్ టిబి ఉన్న ఐదుగురిలో ఇద్దరు మాత్రమే చికిత్స తీసుకున్నారు. "2020లో 214,000 మంది ఎచ్ఐవీ రోగులతో పాటు, 1.5 మిలియన్ల మంది టిబితో మరణించారు," అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ టిబి నివేదిక వెల్లడించింది.
“క్షయవ్యాధి ఎముకలు, వెన్నెముక, కడుపు, మెదడుతో సహా శరీరంలోని ఏ భాగాన్నైనా దెబ్బతీయగలదు. ఈ వ్యాధి బారినపడి కోలుకున్న పిల్లలున్నారు, కానీ వాళ్ళ చదువులు మాత్రం దెబ్బతిన్నాయి," డాక్టర్ వోట్ అన్నారు..
అనేకమంది క్షయవ్యాధి రోగులు తమ జీవనోపాధి కోల్పోయారు. “నేను ఊపిరితిత్తుల క్షయవ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా ఇప్పుడు పని చేయలేకపోతున్నాను. నా బలమంతా పోయింది,” అని గతంలో రిక్షాను లాగే షేక్ సహాబుద్దీన్ చెప్పారు. ఒకప్పుడు హౌరా జిల్లాలో ప్రయాణీకులను రిక్షా ఎక్కించుకుని వారి గమ్యాలకు చేర్చిన బలమైన వ్యక్తి ఇప్పుడు నిస్సహాయంగా మారిపోయారు. “మా కుటుంబంలో ఐదు మందిమి ఉన్నాం. మేమెలా బ్రతకాలి?" అని ఈ సాహాపూర్ నివాసి ప్రశ్నించారు.


ఎడమ: గొంతు, భుజాల చుట్టూ గడ్డలున్న ఈ అమ్మాయికి చికిత్స మధ్యలోనే ఆపేయడం వల్ల మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ టిబి వచ్చిందని వైద్యులు అనుమానిస్తున్నారు. కుడి: 'నేను భవన నిర్మాణ రంగంలో పని చేసేవాడ్ని, కానీ నాకిప్పుడు నిలబడే శక్తి కూడా లేదు. నా ఛాతీ పరీక్షల కోసం ఇక్కడికి వచ్చాను. కొన్నాళ్ళ క్రితం నుంచి నాకు గులాబీ రంగు కఫంతో దగ్గు మొదలైంది,' అని పాఁచు గోపాల్ మండల్ చెప్పారు


ఎడమ: ని-క్షయ్ (ని-ముగింపు, క్షయ్-క్షయ) అనేది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) క్రింద టిబి నియంత్రణ కోసం అంతర్జాలం ద్వారా రోగులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఈ సింగిల్-విండో ప్లాట్ఫామ్, క్షయవ్యాధి చికిత్స వరుస దశలను డిజిటలైజ్ చేయడంలో సహాయపడుతుంది. కేటాయించిన ఐడీని బట్టి ఏ రోగి వివరాలనైనా దీనిలో తనిఖీ చేయొచ్చు. కుడి: బ్యాఁట్రా సొసైటీలో 16 ఏళ్ళ వయసున్న ఎముకల క్షయ రోగి తయారుచేసిన దుస్తుల నమూనా. ఇక్కడ రోగులు స్వయం సమృద్ధి కావటం కోసం సూది పని, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇస్తారు
పాఁచు గోపాల్ మండల్ బ్యాఁట్రా హోమ్ వెల్ఫేర్ సొసైటీ వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే ఒక వయసుమళ్ళిన రోగి. ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు, “నా వద్ద రూ. 200 కూడా లేవు, నిలబడే శక్తి కూడా లేదు. నా ఛాతీ పరీక్షల కోసం ఇక్కడికి వచ్చాను. కొన్నాళ్ళ నుంచి నాకు గులాబీ రంగు కఫంతో దగ్గు మొదలైంది,” అని ఈ 70 ఏళ్ళ హౌరా నివాసి చెప్పారు. తన కుమారులంతా పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళారని ఆయన అన్నారు.
క్షయవ్యాధి నియంత్రణ కోసం అంతర్జాలం ద్వారా రోగులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ, ని-క్షయ్. ఇది చికిత్స ఎలా సాగుతుందో పరిశీలించే సమగ్ర, సింగిల్ విండోగా పనిచేస్తుంది. క్షయ రోగులను గుర్తించడం, వాళ్ళు కోలుకుంటున్నారని నిర్ధారించుకోవడం, సంరక్షణలో కీలకమైన అంశం. సొసైటీ ప్రధాన పరిపాలనాధికారి సుమంత ఛటర్జీ మాట్లాడుతూ, "మేం దానిలో [ని-క్షయ్] రోగులందరి వివరాలను నమోదు చేసి, ట్రాక్ చేస్తాం," అన్నారు. పిల్ఖానా మురికివాడలలో క్షయ సోకినవారు అధిక సంఖ్యలో ఉన్నారు, ఎందుకంటే ఇది "రాష్ట్రంలో అత్యంత ఇరుకైన మురికివాడలలో ఒకటి," అని ఆయన చెప్పారు.
క్షయవ్యాధిని నయం చేయొచ్చు, నివారించవచ్చు అన్నది వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా, కోవిడ్ -19 తర్వాత టిబియే రెండో ప్రధాన ప్రాణాంతకమైన అంటువ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది .
అంతే కాకుండా, కోవిడ్-19 ఆవిర్భావం తర్వాత దగ్గు, అనారోగ్యంగా కనిపించడం అనేవి సమాజంలో భయం కలిగించే అంశాలుగా మారాయి. ఆ భయం వల్ల క్షయరోగులు తమ అనారోగ్యాన్ని దాచిపెడుతుండటంతో వ్యాధి ముదిరి, అంటువ్యాధి తీవ్రతరం అయ్యే అవకాశం ఏర్పడుతోంది.
నేను క్రమం తప్పకుండా ఆరోగ్య సమస్యల గురించి రాస్తున్నాను,
కానీ చాలామంది ఇప్పటికీ క్షయవ్యాధితో బాధపడుతున్నారని నాకు తెలీదు. ఇది ప్రాణాంతక వ్యాధి
కాకపోవడం వల్ల, దీని గురించి ఎక్కువగా చర్చించడం జరగటంలేదు. ఇది అన్నిసార్లూ ప్రాణాంతకం
కాకపోయినప్పటికీ, ఈ వ్యాధి కుటుంబాన్ని పోషించే వ్యక్తులపై ప్రభావం చూపి, ఆ కుటుంబానికి
తీవ్ర ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోందని నేను గుర్తించాను. అంతే కాదు, వ్యాధి నుంచి
కోలుకోవడమనేది సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది అప్పటికే అంతంత మాత్రంగా జీవనం సాగిస్తోన్న
కుటుంబాలపై ఆర్థికంగా పెనుభారాన్ని మోపుతుంది.
గోప్యత కోసం ఈ కథనంలోని కొన్ని పేర్లను మార్చాం.
ఈ కథనానికి సహకరించిన జయప్రకాశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ చేంజ్ (JPISC) సభ్యులకు రిపోర్టర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. JPISC క్షయతో బాధపడుతున్న పిల్లలతో సన్నిహితంగా పనిచేస్తోంది, వారికి నిరంతరాయంగా విద్య లభించేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది.
అనువాదం: రవి కృష్ణ