నవంబర్ నెలలో ఒక మూడు రోజుల పాటు మాజులీ ద్వీపంలోని గరముర్ మార్కెట్ రంగురంగుల విద్యుద్దీపాలు, మట్టి ప్రమిదలతో వెలిగిపోతుంది. తొందరగా చీకటిపడే శీతాకాలపు సాయంత్రాలలో చుట్టూ అక్కడక్కడా ఉన్న లౌడ్ స్పీకర్ల నుండి ఖోల్-తాళ్ ల చప్పుళ్ళు వినిపిస్తాయి.
రాస్ మహోత్సవం మొదలయింది.
ఈ ఉత్సవం అస్సామీ నెలలైన కాతి-ఆఘొన్ లలో - ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్-నవంబర్ నెలలు - వచ్చే నిండు పూర్ణిమ నాడు మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఈ ద్వీపానికి భక్తులనూ పర్యాటకులనూ ఆకర్షించే ఈ పండుగ ఆ తర్వాత మరో రెండు రోజులపాటు కొనసాగుతుంది.
"ఈ పండుగే జరగకపోతే, మాకు ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. అది (రాస్ మహోత్సవ్) మా సంస్కృతి," అంటారు వరుణ్ చితాదర్ చుక్ గ్రామానికి చెందిన ఈ ఉత్సవ నిర్వాహక కమిటీ కార్యదర్శి రాజా పాయేంగ్.
చక్కటి దుస్తులు ధరించివున్న వందలాది మంది ప్రజలు అస్సామ్లోని అన్ని ఇతర సత్రాల మాదిరిగానే నవ వైష్ణవ మతానికి చెందిన గరముర్ సరు సత్రం సమీపంలో గుమిగూడారు.

2022లో అస్సామ్లోని మాజులీలో 60కి పైగా మహోత్సవం జరిగే ప్రదేశాలలో ఒకటైన గరముర్ సరు సత్రం. వేదికపై అలంకరణలు చేస్తోన్న కృష్ణ దత్తా (నిలబడినవారు)

గరముర్ సరు సత్రం వద్ద గోడకు ఆనించి ఉన్న పౌరాణిక సర్పం కాళీయ నాగ్ ఐదు పడగలు. ఇటువంటి చేతి తయారీ కళాకృతులు ఉత్సవ ప్రదర్శనలలో ఒక పెద్ద బాగం
రాస్ మహోత్సవ్ (కృష్ణుని నృత్యోత్సవం) కృష్ణ దేవుని జీవితాన్ని నృత్య, నాటక, సంగీత ప్రదర్శనల ద్వారా వేడుక చేసే ఉత్సవం. ఒక్క రోజు ఉత్సవంలోనే వేదికపై 100కు పైగా పాత్రలను ప్రదర్శించవచ్చు.
ఈ ప్రదర్శనలు కృష్ణుని జీవితంలోని వివిధ దశలను - బాలునిగా బృందావనంలో పెరిగినప్పటి నుంచి గోపికలతో నాట్యమాడాడని చెప్పే రాస లీల వరకూ - చిత్రిస్తారు. ఈ సమయంలో ప్రదర్శించే కొన్ని నాటకాలలో శంకరదేవ రచించిన 'కేళీ గోపాల్', ఆయన శిష్యుడు మాధవదేవ రచించినట్టుగా చెప్పే 'రాస్ ఝుమురా' వంటి అంకియ నాట్ (ఏకాంకికలు) రూపాంతరాలుంటాయి.
తాను నటించేటపుడు కొన్ని నిర్దిష్టమైన సంప్రదాయాలను పాటించాల్సివుంటుందని గరముర్ మహోత్సవంలో విష్ణు పాత్రను వేసే ముక్తా దత్తా చెప్పారు: "కృష్ణ, నారాయణ, విష్ణు వంటి పాత్రలను మాకిచ్చిన రోజు నుంచి, మేం కేవలం శాకాహార సాత్విక ఆహారాన్ని మాత్రమే తింటాం. రాస్ మొదటి రోజున మేం బ్రత (వ్రతం-ఉపవాసం)ని పాటిస్తాం. మొదటిరోజు ప్రదర్శన ముగిసిన తర్వాత మాత్రమే మేం బ్రత భంగం చేస్తాం."
అస్సామ్ గుండా 640 కిలోమీటర్ల మేర ప్రవహించే బ్రహ్మపుత్రానదిలోని ఒక విశాలమైన ద్వీపం మాజులీ. ఈ దీవిలోని సత్రాలు (మఠాలు) వైష్ణవ మతానికే కాక కళకూ సంస్కృతికీ కూడా కేంద్రాలే. సంఘ సంస్కర్త, సాధువూ అయిన శ్రీమంత శంకరదేవ 15వ శతాబ్దంలో స్థాపించిన ఈ సత్రాలు అస్సామ్లో నవ-వైష్ణవ భక్తి ఉద్యమానికి ఒక రూపును దిద్దడంలో ప్రముఖ పాత్రను పోషించాయి.
మాజులీలో 65కు పైగా ఉన్న సత్రాలలో , ఈరోజున 22 మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదీ పరివాహక వ్యవస్థలలో ఒకటైన బ్రహ్మపుత్రా నదికి పదే పదే వచ్చే వరదల వలన మిగిలిన సత్రాలు కోతకు గురయ్యాయి. వేసవి-ఋతుపవన మాసాలలలో కరిగే హిమాలయాలలోని హిమానీనదాల మంచు, ఈ నదీ పరీవాహక ప్రాంతంలో ఖాళీ అయిపోయే నదులను నీటితో నింపుతుంది. దీనితో పాటు మాజులీలోనూ, పరిసర ప్రాంతాలలోనూ కురిసిన వర్షపాతం కోత ఏర్పడటానికి ప్రాథమిక పరిస్థితులను సృష్టిస్తుంది.

మేకప్ చేయించుకుంటోన్న విష్ణు పాత్రధారి ముక్తా దత్తా

2016 రాస్ మహోత్సవ్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతోన్న ఉత్తర కమలాబారీ సత్రంలోని సన్యాసులు
ఈ సత్రాలు రాస్ మహోత్సవ్ వేడుకలకు వేదికలుగా పనిచేస్తాయి. ద్వీపంలోని వివిధ సముదాయాలకు చెందిన ప్రజలు కమ్యూనిటీ భవనాలలో, బహిరంగ మైదానాల్లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికలపై, పాఠశాల మైదానాల్లో కూడా ఈ వేడుకలనూ ప్రదర్శనలనూ సమష్టిగా జరుపుకుంటారు.
గరముర్ సరు సత్రంలో రాస్ ప్రదర్శనలో మహిళలు కూడా పాల్గొంటారు కానీ ఉత్తర కమలాబారీ సత్రంలో అలా కాదు. ఇక్కడ మతపరమైన, సాంస్కృతిక విద్యను అందించే భకత్స్ (భక్తులు) అనే సత్రానికి చెందిన బ్రహ్మచారులైన సన్యాసులు మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఈ నాటకాలను ప్రదర్శిస్తారు.
ఇంద్రనీల్ దత్తా (82) గరముర్ సరు సత్రంలో రాస్ మహోత్సవ్ వ్యవస్థాపకులలో ఒకరు. 1950లో ఆ సత్రాధికార్ (సత్రం ప్రధాన అధికారి)గా ఉన్న పీతాంబర్ దేవ్ గోస్వామి ప్రదర్శనలలో కేవలం పురుషులే నటించే సంప్రదాయానికి స్వస్తి పలికి, మహిళా నటులను ఎలా స్వాగతించారో ఇంద్రనీల్ గుర్తుచేసుకున్నారు.
“పీతాంబర్ దేవ్ (సంప్రదాయ ప్రదేశమైన) నామ్ఘర్ (ప్రార్థనా మందిరం)కు వెలుపల ఒక వేదికను నిర్మించారు. నామ్ఘర్ ప్రార్థనా స్థలం కాబట్టి, మేం వేదికను బయటకు తీసుకువచ్చాం,” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మహోత్సవాన్ని నిర్వహించే 60కి పైగా ఉన్న ప్రదేశాలలో గరముర్ కూడా ఒకటి. 1000మందికి పైగా కూర్చొని చూడగలిగేలా ఏర్పాట్లు చేసిన సమావేశ మందిరంలో జరిగే ఈ ప్రదర్శనలను చూసేందుకు టిక్కెట్ కొనుక్కోవాలి.

![Right: Children rehearse for their roles as gopa balaks [young cowherds]. A mother fixes her child's dhoti which is part of the costume](/media/images/06b-_PRK8941-PB-Raas_Mahotsav_and_the_satr.max-1400x1120.jpg)
ఎడమ: మహోత్సవ్ ప్రారంభానికి రెండు వారాల ముందు గరముర్ సత్రంలో జరుగుతోన్న రిహార్సల్స్. కుడి: తాము వేసే గోప బాలకుల పాత్రల కోసం రిహార్సల్ చేస్తోన్న పిల్లలు. పాత్ర వేషధారణలో భాగంగా కొడుకు కట్టుకున్న ధోవతిని సర్దుతోన్న తల్లి
ఇక్కడ ప్రదర్శించే నాటకాలు వైష్ణవ సంప్రదాయంలో శంకరదేవ, మరికొంతమంది రచించిన నాటకాలకు రూపాంతరాలు. అనుభవజ్ఞులైన కళాకారులు కొత్తకు అనుగుణంగా మార్చినవి. “నేను నాటకాన్ని రాసేటప్పుడు, అందులో లోక్ సంస్కృతి కి (జానపద సంస్కృతి) చెందిన అంశాలను ప్రవేశపెడతాను. మనం మన జాతిని, సంస్కృతిని సజీవంగా ఉంచుకోవాలి" అని ఇంద్రనీల్ దత్తా చెప్పారు.
దీపావళి వెళ్ళిన మరుసటి రోజునుంచే ప్రధాన రిహార్సల్ మొదలవుతుంది," అన్నారు ముక్తా దత్తా. ఇది ప్రదర్శకులకు సిద్ధపడేందుకు రెండు వారాల కంటే తక్కువ సమయాన్ని ఇస్తుంది. "ఇంతకుముందు నటించినవారు వివిధ ప్రదేశాలలో నివసిస్తున్నారు. వాళ్ళను తిరిగి రప్పించడం ఇబ్బందవుతుంది," నటించడంతో పాటు గరముర్ సంస్కృత టొల్ (పాఠశాల)లో ఆంగ్లాన్ని కూడా బోధించే దత్తా చెప్పారు.
కళాశాలల, విశ్వవిద్యాలయాల పరీక్షలు తరచుగా మహోత్సవ్ సమయంలోనే జరుగుతుంటాయి. "అయినా వస్తారు (విద్యార్థులు), కనీసం ఒక రోజు కోసమైనా సరే. రాస్లో తమ పాత్రను ప్రదర్శించి, ఆ మరుసటి రోజున పరీక్ష రాయటానికి వెళ్ళిపోతుంటారు," అన్నారు ముక్తా.
ఈ ఉత్సవ నిర్వహణ కోసం అయ్యే ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతూపోతోంది. గరముర్లో 2022లో అయిన ఖర్చు సుమారు 4 లక్షలు. "టెక్నీషియన్లకు మేం చెల్లిస్తాం. నటించేవారంతా స్వచ్ఛందంగా ఆ పని చేస్తారు. దాదాపు 100-150 మంది స్వచ్ఛందంగానే పనిచేస్తారు." ముక్తా చెప్పారు.
వరుణ్ చితాదర్ చుక్లో రాస్ మహోత్సవాన్ని అసామ్లో షెడ్యూల్డ్ తెగలకు చెందిన మిసింగ్ (మిషింగ్) ప్రజలు స్థానిక పాఠశాలలో నిర్వహిస్తారు. గత కొన్నేళ్ళుగా యువతలో ఆసక్తి లేకపోవడం వలన, ఈ ప్రాంతం నుంచి వలసలు విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రదర్శనకారుల సంఖ్య తగ్గిపోయింది. అయినా వారు పట్టుదలతోనే ఉన్నారు. "మేం రాస్ నిర్వహించకపోతే, గ్రామానికి ఏదైనా అమంగళం జరుగుతుంది. ఇది గ్రామస్థులలో ప్రాచుర్యం పొందిన నమ్మకం," అని రాజా పాయేంగ్ చెప్పారు.

రాస్ మహోత్సవం ప్రతి ఏటా మాజులీకి యాత్రికులనూ పర్యాటకులనూ ఆకర్షిస్తుంది. బ్రహ్మపుత్రా నదిపై ఉన్న ప్రధాన ఫెర్రీ స్టేషన్ కమలాబారీ ఘాట్ ఈ పండుగ సమయంలో మరింత రద్దీగా ఉంటుంది

ఉత్సవంలో ఉపయోగించే సెట్లపై పనిచేయడానికి గత 11 సంవత్సరాలుగా వాస్తవ్ సైకియా నగావ్ జిల్లా నుండి మాజులీకి వస్తున్నారు. ఇక్కడితను గరముర్ ప్రదర్శనలో ఉపయోగించే కంసుని సింహాసనం నేపథ్యాన్ని చిత్రిస్తున్నారు

స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తోన్న అనిల్ సర్కార్ (మధ్యలో ఉన్నవారు)తో తమ పిల్లలకు అలంకరణ చేయించడానికి చుట్టూ గుమిగూడిన పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు

తమ సన్నివేశాల కోసం సిద్ధమవుతోన్న గోప బాలకుల వేషధారణలో ఉన్న పిల్లలు

గరముర్ సరు సత్ర ఉత్సవంలో కంసుని పాత్రను పోషిస్తోన్న మృదుపవన్ భుయాఁను ఇంటర్వ్యూ చేస్తోన్న రిపోర్టర్లు

తెరవెనుక, నిద్రకు వచ్చిన చిన్నారిని జోకొడుతోన్న ముక్తా దాస్

కాళీయ నాగుని విగ్రహం చుట్టూ ప్రమిదలనూ, సాంబ్రాణి కడ్డీలనూ వెలిగిస్తోన్న మహిళలు. ఉత్సవం ప్రారంభం కావటానికి ముందు చేసే పూజలలో ఈ అచారం కూడా ఒక భాగం

గరముర్ సరు సత్రం గేట్ల వద్ద ఫొటోలు తీసుకుంటోన్న ప్రజలు

ప్రస్తావనలో - నాటకంలో మొదటి దృశ్యం - భూమికి సంబంధించిన విషయాలను గురించి చర్చిస్తోన్న బ్రహ్మ (కుడి), మహేశ్వర (మధ్యలో), విష్ణు, లక్ష్మి (ఎడమ)

బాలకృష్ణుని చంపుతానని కంసునికి (ఎడమ) మాట ఇస్తోన్న యువతి వేషంలో (మోహిని పూతన) ఉన్న రాక్షసి పూతన (మధ్యలో)

బృందావనంలోని ప్రజలు కృష్ణుని పుట్టుకను వేడుకగా చేసే నందోత్సవ్ దృశ్యం కోసం తెరవెనుక సిద్ధమవుతోన్న గోపికల వేషాలలో ఉన్న యువతులు

రాస్ మహోత్సవ్ కృష్ణ దేవుని జీవితాన్ని నృత్య, నాటక, సంగీత ప్రదర్శనల ద్వారా వేడుక చేసే ఉత్సవం. ఒక్క రోజు ఉత్సవంలోనే వేదికపై 100కు పైగా పాత్రలను ప్రదర్శించవచ్చు

బాలకృష్ణుడికి పాలద్వారా విషం పెట్టడానికి ప్రయత్నించి, తానే మరణించిన పూతన అనే రాక్షసి. సన్నివేశంలోకి ప్రవేశించిన యశోద (ఎడమ)

బృందావనంలో గోపికలతో నృత్యం చేస్తోన్న కృష్ణుడు

గురముర సరు సత్రంలో, కొంగ రూపంలో ఉన్న బకాసురుడనే రాక్షసుడిని బాలకృష్ణుడు చంపిన సన్నివేశాన్ని అభినయిస్తోన్న పిల్లలు

ధేనుకాసుర వధ సన్నివేశాన్ని ప్రదర్శిస్తోన్న కృష్ణుడు, అతని అన్న బలరాముని వేషాలలో ఉన్న బాల నటులు

అస్సామ్లోని మాజులీలో జరిగిన గరముర్ సరు సత్ర రాస్ మహోత్సవ్ ప్రదర్శనలలో పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

కాళీయ దమన్ సన్నివేశంలో యమునా నదిలో నివసించే కాళీయ నాగును ఓడించిన కృష్ణుడు అతని పడగపై నాట్యం చేస్తోన్న దృశ్యం

ప్రదర్శనలను చూసి ఆస్వాదిస్తోన్న నటులు, ప్రేక్షకులు

2016లో ఉత్తర కమలాబారీ సత్రంలో మహోత్సవ్లో ప్రదర్శించేందుకు కేళీ గోపాల్ నాటకం రిహార్సల్ కోసం సిద్ధపడుతోన్న సన్యాసులు. 1955లో ఈ ఆడిటోరియాన్ని కట్టడానికి మునుపు, ఈ ప్రదర్శనలన్నీ నామ్ఘర్లో (ప్రార్థనా స్థలం) జరిగేవి

ఉత్తర కమలాబారీ సత్రం వద్ద రాస్ మహోత్సవ్ కోసం జరిగే ప్రదర్శనల చివరి రోజు రిహార్సల్స్

తమ బొహా (విడిది)లో ఉత్తర కమలాబారీ సత్రానికి చెందిన సన్యాసులు, నిరంజన్ సైకియా (ఎడమ), కృష్ణ యదుమణి సైకియా (కుడి). నాటక దుస్తులను ధరించడం చాలా సుదీర్ఘ ప్రక్రియ

ప్రదర్శనలలో ఉపయోగించే ముసుగులు, వాటిని తయారుచేసే విధానం రాస్ మహోత్సవంలో అంతర్భాగం. అసురుల, దానవుల పాత్రల కోసం తయారుచేసిన ముసుగులు ధరించి వేదికపైకి వెళ్తోన్న నటీనటులు

ఈ ఉత్సవం కోసం వరుణ్ చితాదార్ చుక్ గ్రామంలో చిత్రిస్తోన్న కాళీయ నాగు ముసుగు

వరుణ్ చితాదార్ చుక్ గ్రామ ఉత్సవ ప్రారంభ ప్రార్థనలలో దామోదర్ మిలీ చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించిన మునిన్ కామాన్ (మధ్యలో). ఒక దశాబ్దం క్రింద మరణించిన మిలీ ఆ గ్రామవాసులకు రాస్ నిర్వహణను నేర్పించారు

మాజులీలోని వరుణ్ చితాదార్ చుక్ గ్రామంలోని వేదిక

తన ప్రదర్శన కోసం సిద్ధపడుతోన్న అపూర్వో కామాన్ (మధ్యలో). గత కొన్ని సంవత్సరాలుగా ఈయన వరుణ్ చితాదార్ చుక్ ఉత్సవంలో కంసునిగా వేషం కడుతున్నారు

ప్రదర్శనలో ఉపయోగించే ముసుగులలో ఒకదాన్ని ధరించి చూస్తోన్న ఒక యువకుడు

వరుణ్ చితాదార్ చుక్ మహోత్సవంలో మిసింగ్ సముదాయం తయారుచేసే ప్రసిద్ధి
చెందిన కాల్చిన పంది మాంసం, సంప్రదాయ బియ్యపు సారా ఆపంగ్
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి